నంద్యాల జిల్లాలో టపాసు విక్రయశాలల ఏర్పాటు కోసం ఈ సంవత్సరం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ తెలిపారు. శనివారం నాడు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తాత్కాలిక టపాసు విక్రయశాలల ఏర్పాటుపై సంబంధిత శాఖాధికారులు, వ్యాపారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

సింగిల్ విండో వ్యవస్థ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సంవత్సరం నుంచి ఫైర్, పోలీస్, రెవెన్యూ శాఖల అనుమతులను ఒకే చోట — సింగిల్ విండో వ్యవస్థ ద్వారా మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీనివల్ల వ్యాపారులకు సౌకర్యం కలుగుతుందని అన్నారు. తాత్కాలిక లైసెన్స్ పొందదలచిన వ్యాపారులు తమ దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోపు సంబంధిత రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలకు సమర్పించుకోవాలని సూచించారు.అందిన దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 18వ తేదీలోగా అనుమతులు జారీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.
అగ్ని ప్రమాదాలు
విక్రయశాలలు ఏర్పాటు చేసే సమయంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. టపాసు స్టాళ్ల వద్ద అగ్ని మాపక పరికరాలు సిద్ధంగా ఉంచడం, భద్రతా దూరం పాటించడం, అనధికార ప్రదేశాల్లో విక్రయాలు చేయకూడదని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్, డోన్ ఆర్డీవో నరసింహులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply