నంద్యాలలో ఆదివారం నంది రైతు సమాఖ్య రజతోత్సవ వార్షికోత్సవం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంది రైతు సమాఖ్య 25 సంవత్సరాల ప్రత్యేక వార్షిక సంచికను అతిథులు, రైతులు, రైతు నాయకులు ఆవిష్కరించారు.నంది రైతు సమాఖ్య ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోచా మాట్లాడుతూ రైతు సంఘాల కృషితో గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమైందని అలాగే గిట్టుబాటు ధరల కోసం సమాఖ్య కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టడానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.. డా. రవీంద్రనాథ్ మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు నంది రైతు సమాఖ్య రైతాంగం యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి పరచడానికి అనేక సదస్సులు నిర్వహించిందన్నారు. రైతు సంక్షేమానికి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత రైతుల అభ్యున్నతికి కృషి చేసిందన్నారు.

ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ రైతులకు సరసమైన ధరలతో నాణ్యత కలిగిన ఎరువులు పురుగుమందులు అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. డ్రోన్ వినియోగం లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మంచి దిగుబడులు పెంచడానికి రైతు సమాఖ్య రైతులకు తగు సూచనలు ఇవ్వాలని కోరారు.. ప్రధాన వక్త డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు మాట్లాడుతూ రైతు సమాఖ్య రైతులకు వివిధ పంటలపై సమగ్ర సస్యరక్షణ ,అధిక దిగుబడులకు సూచనలిచ్చి శాస్త్రవేత్తల సహకారంతో రైతులను చైతన్యవంతులుగా తయారు చేయడం అభినందనీయం అన్నారు.

రైతు నాయకులు రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం, పోతిరెడ్డిపాడు జలాశయాల నీటిని రాయలసీమ రైతులకు సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా పరిమితిని పెంచాలన్నారు.. రైతు సమాఖ్య ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ ఓబుళపతి మాట్లాడుతూ నంది రైతు సమాఖ్య 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన రజతోత్సవ సంచికలో రైతాంగానికి ఉపయోగపడే పలు వ్యాసాలు, శాస్త్రవేత్తల సూచనలు పొందుపరిచామన్నారు..
కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న మహిళా రైతులు పద్మావతమ్మ, గోవిందమ్మలను సత్కరించారు . కార్యక్రమంలో సమాఖ్య తదుపరి అధ్యక్షునిగా బివి రామసుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రైతు నాయకులు శివరామకృష్ణారెడ్డి, శివారెడ్డి, అనుపూరు రామ సుబ్బారెడ్డి, రఫీ, హరినాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, డివి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply