NANDYAL Oct 23 :- రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మీడియం లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో స్టడీ మెటీరియల్ ను విడుదల చేశారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సి ఈ డి ఎం ) ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన ఉర్దూ మీడియం పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను రాష్ట్ర న్యాయ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం నంద్యాలలో ఆవిష్కరించారు. సిఈడిఎం సంచాలకుడు (ఎఫ్ఏసి), రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ,ఎండి యాకుబ్ భాష అధ్యక్షతన స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మైనారిటీ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, పదవ తరగతి పాస్ అయితే జీవితం కూడా సగం పాస్ అయినట్లేనని అందువలన ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతి పాస్ కావాలనే సంకల్పంతో నిష్ణాతులచే స్టడీ మెటీరియల్ రూపొందించడం జరిగిందని అన్నారు. మైనారిటీలకు ఉన్నత విద్యతో పాటు, యు పి ఎస్ సి, ఏపీపీఎస్సీ, టెట్, నీట్,డీఎస్సీ లాంటి ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తో కూడిన చర్యలను అమలు చేస్తున్నదని అన్నారు.

మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సిఈడిఎం కేంద్రాల ద్వారా మైనారిటీ విద్యార్థులకు ఉచిత విద్య,ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఉర్దూ విద్యార్థుల కోసం రూపొందించిన స్టడీ మెటీరియల్ ను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న ఉర్దూ పదవ తరగతి విద్యార్థులకు సిఈడియం ద్వారా పంపుతున్నట్లు, అందుకు తగిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సంచాలకుడు యాకూబ్ భాషను మంత్రి ఫరూక్ ఆదేశించారు. రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు.

ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు, మౌలిక వసతులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఫరూక్ ఆకాంక్షించారు. సిఈడిఏం సంచాలకుడు యాకుబ్ భాష మాట్లాడుతూ మైనారిటీ మంత్రి ఫరూక్ ప్రత్యేక చొరవతో పబ్లిక్ పరీక్షలకు ఆరు నెలల ముందుగానే ఉర్దూ స్టడీ మెటీరియల్ ను రూపొందించడం జరిగిందని, నవంబర్ 5వ తేదీ లోపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న ఉర్దూ పదవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తామన్నారు.

అనంతరం నంద్యాల అసెంబ్లీ పరిధిలో ఉర్దూ మీడియం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాలను మంత్రి ఫరూక్ చేతుల మీదుగా సిఈడిఎం అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, జిల్లా ఉర్దూ పాఠశాలల తనిఖీ అధికారి అస్ముద్దీన్, పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
📖 Also Available as Web Story
Experience this content as an engaging Web Story - perfect for mobile reading!
🎬 View Web Story


Arattai



Leave a Reply