• ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా అవసరం
• ఒడిశా నుంచి వచ్చే ఏనుగులను తిరిగి మళ్లించే చర్యలు తీసుకోండి
• రాష్ట్ర సీతాకోక చిలుకగా తిరుమల లిమినియేసి బ్లూ టైగర్ గుర్తింపునకు ప్రతిపాదన
• జాతీయ వన్య ప్రాణి బోర్డు సమావేశానికి జాతీయ రహదారులకు అటవీ భూముల సేకరణ నివేదిక
• రాష్ట్ర వన్య ప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్

పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతానికి ఒడిశా వైపు నుంచి వస్తున్న మదపుటేనుగుల సమస్యను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణశాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశించారు. మన్యంలో ఏనుగుల సంచారం వల్ల జరుగుతున్న పంట నష్టం, ప్రాణ నష్టంపై నివేదిక ఇవ్వాలని సూచించారు. మదపుటేనుగుల గుంపుల జాడను ఎప్పటికప్పుడు తెలుసుకుని పంటలకు నష్టం వాటిల్లకుండా వాటిని మళ్లించే ఏర్పాట్లు చేయాలన్నారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన రాష్ట్ర వన్య ప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకోవాల్సిన అటవీ అనుమతులు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనుషులు, జంతువుల మధ్య జరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దుల్లో మదపుటేనుగుల సంచారం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒడిశా వైపు రాష్ట్రంలో ప్రవేశించిన రెండు గుంపులు పంటలను ధ్వంసం చేస్తున్నాయని క్షేత్ర స్థాయి నుంచి తెలిసింది. రైతుల ఇబ్బందుల దృష్ట్యా ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. ట్రాకర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని తిరిగి అడవిలోకి మళ్లించాలి. ఒడిశా వైపు నుంచి వస్తున్నాయి కాబట్టి అవసరం అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటిని వెనక్కి పంపే విధంగా చర్యలు తీసుకోవాలి.

అటవీ భూముల సేకరణపై జాతీయ వన్యప్రాణి బోర్డుకు నివేదిక
రాష్ట్ర పరిధిలో పలు జాతీయ రహదారుల నిర్మాణానికి అటవీ భూములు అవసరం అవుతాయి. అటవీ భూములతో పాటు ఎకో సెన్సిటివ్ జోన్, టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలో ఉన్న భూములను దీని నిమిత్తం సేకరించాల్సి ఉంది. బద్వేల్, నెల్లూరు మధ్య 67వ నంబర్ నాలుగు లైన్ల జాతీయ రహదారి నిమిత్తం 34.67 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఈ ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉంది. ఈ భూములను బదిలీ చేసేందుకు జాతీయ వన్య ప్రాణి బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి కోసం పంపించనున్నాం. బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ ప్రెస్ కారిడార్ కోసం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ తో పాటు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ నుంచి 40.86 హెక్టార్లు భూమి బదిలీ చేసేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇండియా అనుమతులతో పాటు జాతీయ వన్య ప్రాణి బోర్డుకు నివేదిక అందజేయనున్నాం. ఈ నెల 29వ తేదీన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశానికి పై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.

రాష్ట్రంలో కనిపించే అరుదైన సీతాకోక చిలుక అయిన తిరుమల లిమినియేసి బ్లూ టైగర్ సీతాకోక చిలుకను… రాష్ట్ర సీతాకోక చిలుకగా గుర్తించాలని జాతీయ వన్య ప్రాణి బోర్డు ప్రతిపాదన పంపుతున్నామ”న్నారు.
ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం. మల్లికార్జున నాయక్, పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ డాక్టర్ పి.వి. చలపతిరావు, మత్స్య శాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్, అడిషనల్ డి.జి.ఎన్. మధుసూదన్ రెడ్డి, ప్రముఖ శాస్త్రవేత్తలు దీపా జైశ్వాల్,సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
📖 Also Available as Web Story
Experience this content as an engaging Web Story - perfect for mobile reading!
🎬 View Web Story


Arattai



Leave a Reply