NANDYAL Dec 10:-విభిన్న ప్రతిభావంతులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రాణించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఛైర్మన్ గడుపూటి నారాయణ స్వామి, ఉమ్మడి జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి రయిజ్ ఫాతిమా, డిఆర్డిఎ పీడీ శ్రీధర్ రెడ్డి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కళ్యాణి, జిల్లా నైపుణ్య అధికారి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ సాధారణ ప్రజానీకం – విభిన్న ప్రతిభావంతులు అనే తారతమ్యం లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరు సమాన అవకాశాలతో ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. డిసెంబరు 3న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభావంతుల శ్రేయస్సు కోసం ‘ఇంద్రధనస్సు’ పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. విభిన్న ప్రతిభావంతులలో అపారమైన ప్రతిభ ఉందని, దాన్ని సరైన దారిలో వినియోగించుకుంటే జీవితంలో మరింత ఎత్తులకు చేరుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
విద్యాపరమైనా, క్రీడాపరమైనా వారికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్న ఫలితంగా అంధుల క్రికెట్ టోర్నమెంట్లలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నారని తెలిపారు. ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు పాత్ర వహించిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ భర్తీ, రెగ్యులర్ నియామకాల్లో వారికి ప్రాధాన్యం కల్పించాలన్న విజ్ఞప్తిపై పరిశీలన జరుగుతుందని చెప్పారు.
భవిత కేంద్రాలకు వచ్చే చిన్నారుల తల్లిదండ్రులకు నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రైవేట్ కంపనీలు నిర్వహించే జాబ్ మేళాల్లో విభిన్న ప్రతిభావంతులు చురుకుగా పాల్గొనాలని సూచించారు.ఉద్యోగుల్లో బదిలీల విషయంలో పారదర్శకత పాటిస్తామని, సర్టిఫికెట్ పునఃమూల్యాంకన కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరచూ రావాల్సి వస్తున్న సమస్యను దృష్టిలో ఉంచుకొని గ్రౌండ్ ఫ్లోర్లోనే కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహించి, అందులో వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే విన్న ప్రతిభావంతుల సమస్యలను కూడా ప్రత్యేక దృష్టితో పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు. సంబంధిత శాఖ సిబ్బంది పిజిఆర్ఎస్ వద్దే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ సచివాలయాలకు వెళ్లే విభిన్న ప్రతిభావంతులకు వేగంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఉద్యోగిగా పనిచేస్తున్న వారికి ఫీల్డ్ సర్వే బాధ్యతల నుంచి మినహాయింపు కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

ఇల్లు లేని ప్రతి కుటుంబానికి గృహం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ‘హౌస్ ఫర్ ఆల్’ పథకాన్ని ప్రారంభించిందని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని దేవాదాయ శాఖ భూమిలో కేటాయించిన 450 ప్లాట్ల సమస్యను త్వరితంగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రత్యేక సెలవులు, ప్రత్యేక వాష్రూమ్స్, ర్యాంపులు ఏర్పాటు వంటి అంశాలపై కూడా త్వరిత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఛైర్మన్ గడుపూటి నారాయణ స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రారంభించిన ‘ఇంద్రధనస్సు’ పథకంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, టిడ్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, సబ్సిడీ రుణాలు, ఎంపిటిసి/జడ్పిటిసి పదవుల్లో రిజర్వేషన్, ప్రతి జిల్లాలో దివ్యాంగ భవన్ ఏర్పాటు వంటి వరాలు ఉన్నట్లు తెలిపారు. నెలకు రు.6,000 పెన్షన్, డయాలసిస్ పేషంట్లకు రు.10,000, మంచానికే పరిమితమైన వారికి రు. 15,000 మొదటి తేదీన అందజేస్తున్నట్లు వివరించారు.
తదుపరి విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులు మస్తాన్ వలి, మహేశ్వర్ రెడ్డి, లక్ష్మీ ఓబులేసు, సుబుల్ భాష, రమణయ్య, బాలసుబ్బయ్య, గంగాధర్, నాగన్న, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, రామకిషోర్, మరియా దాస్, సుధాకర్, జహీరుద్దీన్, గురుమూర్తి, రంగస్వామి, డా.గ్రేస్ తదితరులు మాట్లాడారు.

కార్యక్రమం ముగింపులో ఉత్తమ సేవలు అందించిన విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగులను మొమెంటో, శాలువాలతో కలెక్టర్ మరియు ఛైర్మన్ సత్కరించారు. అనంతరం రాష్ట్ర ఛైర్మన్ను విన్న ప్రతిభావంతులు శాలువాతో ఘనంగా సత్కరించారు. నవజీవన్ చెవిటి పిల్లల సంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.
Arattai