NANDYAL JAN 07:-సంక్షేమ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 150 ముస్తాబు కిట్లను పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్, బీసీ హాస్టళ్లలోని విద్యార్థులకు అందజేయాల్సిన ముస్తాబు కిట్లను సంబంధిత అధికారులకు కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి గోవింద నాయక్, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. చిన్న వయసులోనే పరిశుభ్రత అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఎదుగుతారని పేర్కొన్నారు. ప్రతి హాస్టల్, తరగతి గదిలో “ముస్తాబు కార్నర్” ఏర్పాటు చేసి అద్దం, దువ్వెన, నెయిల్ కట్టర్, హ్యాండ్వాష్, శానిటైజర్ వంటి అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంచాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత పాటించే విద్యార్థులను “పరిశుభ్రత నాయకులు”గా నియమించి, చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత శుభ్రత అలవాట్లను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పరిశుభ్రతపై అవగాహన పొందడమే కాకుండా, ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పరిశుభ్రత పాటించే విషయాలను తమ తల్లిదండ్రులకు వివరించే స్థాయికి చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Arattai