ఆంధ్ర ప్రదేశ్ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆదేశాల మేరకు బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే వారోత్సవాల సందర్భంగా మంగళవారం “ఉమెన్ ఇన్ సైన్స్” థీమ్తో సెమినార్ మరియు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమం విద్యా, శాస్త్ర రంగాల అభివృద్ధికి దోహదపడే విధంగా చర్చలతో కొనసాగింది.
జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన, గౌరవ అధ్యక్షులు కెవి సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ సమన్వయంతో కార్యక్రమం నిర్వహించబడింది. ప్రారంభంలో సర్ సివి రామన్ పటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ఆరంభించారు.
ముఖ్య అతిథులుగా నంద్యాల డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి డి.టి. శంకర్ ప్రసాద్, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి, సైంటిస్ట్ డాక్టర్ కవిత గారు పాల్గొని ప్రసంగించారు. జిల్లా సైన్స్ అధికారి కే సుందర్రావు పాల్గొన్నారు. సైంటిస్ట్ డాక్టర్ కవిత గారు మాట్లాడుతూ శాస్త్ర రంగంలో మహిళల ప్రాధాన్యత, పరిశోధనల్లో వారి పాత్ర, భవిష్యత్ తరాలకు సైన్స్ విద్య అవసరాన్ని వివరించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా శాస్త్ర పరిశోధనల వైపు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సెమినార్లో “ఉమెన్ ఇన్ సైన్స్” అంశంపై ప్రత్యేక ఉపన్యాసం నిర్వహించబడింది. శాస్త్ర రంగంలో మహిళలు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సాధన పథం గురించి విశ్లేషణాత్మకంగా చర్చించబడింది. విద్యార్థుల్లో శాస్త్రాసక్తి పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అనుసరించాల్సిన నూతన బోధన పద్ధతులపై కూడా మార్గదర్శకాలు ఇవ్వబడినాయి.
ఈ సందర్భంగా బయాలజీ విభాగంలో విశిష్ట కృషి చేసి, విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లలో ప్రోత్సహించిన ఉపాధ్యాయులను శాలువాలు, ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. సన్మానితులు తమ అనుభవాలను పంచుకుంటూ శాస్త్ర బోధనలో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చివరగా నిర్వాహకులు అతిథులకు, పాల్గొన్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
Arattai