AMARAVATHI Mar13 :- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రాముఖ్యత మరియు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉందని, ఆ పని తాము చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) ప్రతినిధులు రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రివర్యులు కొలసు పార్థసారథి కి వివరించారు.

రాష్ట్ర సచివాలయంలో మంత్రి గారిని ఐఏఎంఏఐ ప్రతినిధులు కలిసి నేటి డిజిటల్ ప్రచార విప్లవానికి సంబంధించిన వివరాలను వివరించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు డిజిటల్ మీడియా పాలసీలు తెచ్చి….ఆ ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలను మారుమూల గ్రామాల వరకు డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా తీసుకెళ్లి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విషయాలను తెలిపారు. మొబైల్ ద్వారా డిజిటల్ ప్రచారానికి ప్రాధాన్యత పెరిగిన ఈ రోజుల్లో వెబ్ సైట్లు, ప్రత్యేక యాప్ లు, ఇతర మార్గాల ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం కల్పించేందుకు ఏకైక మార్గం డిజిటల్ మీడియా అని ఐఏఎంఏఐ ప్రతినిధులు మంత్రికి వివరించారు.
ఏపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని రెండు కళ్లులా భావిస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వ ఆలోచనా విధానాలను ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన మరింత పెంచాల్సిన ఆవశ్యకత చాలా ఉందని, దానికి మేం సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. డిజిటల్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే….ప్రభుత్వాల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తమ ఆసక్తిని వ్యక్తపరిచారు.

ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్న మంత్రి పార్థసారథి…..డిజిటల్ మీడియా పాలసీని ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి వివరిస్తానని…..త్వరలోనే ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వచ్చేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. దీనిపట్ల ఐఏఎంఏఐ ప్రతినిధులు మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రిని కలిసిన వారిలో ముఖేష్ సింగ్(ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్), కె.ఎల్.ఎన్.రఘు(వే టూ న్యూస్), సుమిత్ సేథి(టైమ్స్ ఇంటర్నెట్), అశ్వని సైని(ఇన్ షార్ట్స్), నరేష్ గౌలికర్(నెట్ వర్క్ 18), శుభజిత్ దాస్ గుప్త మరియు నాదిర్ కాంత్ వాలా(ఐఏఎంఏఐ) ప్రతినిధులు ఉన్నారు.
Arattai