నివాళులర్పించిన కళారాధన, లయన్స్ క్లబ్, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు
NANDYAL Oct 31 :- శుక్రవారం స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ ప్రధమ హోం శాఖ మంత్రి, ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా స్థానిక కళారాధన,జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కళారాధన, లయన్స్ క్లబ్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కళారాధన ప్రధాన కార్యదర్శి,జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ సర్దార్ పటేల్ స్వాతంత్ర్యం తర్వాత 500 కు పైగా స్వతంత్ర సంస్థానాలను, నైజాం ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని పటిష్టపరిచిన మహోన్నతుడని కొనియాడారు. బార్డోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించి, మహాత్మా గాంధీ ముఖ్య అనుచరుడిగా దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించిన మహనీయుడు అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సర్దార్ పటేల్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే సంకల్పంతో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు సమీపంలో సర్దార్ పటేల్ భారీ విగ్రహాన్ని సమైక్యతకు ప్రతీకగా నిర్మించి సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకాలు చిరస్మరణీయం చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కళారాధన కార్యవర్గ సభ్యులు శివరామిరెడ్డి, దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రంగస్వామి,లయన్స్ క్లబ్ సభ్యులు రామయ్య, వెంకటరమణ, కార్యాలయ కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు.
Arattai