SRISAILAM Feb 14:-మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం సమగ్రంగా పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ కట్ట (ముండన మండపం) వద్ద ఏర్పాటు చేసిన సదుపాయాలను స్వయంగా సందర్శించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

కళ్యాణ కట్టలో భక్తులకు అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్, అక్కడి టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, దుస్తులు మార్చుకునే గదులు సరైన విధంగా నిర్వహిస్తున్నారా, తగినంత నీటి సౌకర్యం ఉందా అనే అంశాలను ప్రత్యేకంగా పరిశీలించారు. శుభ్రత, పారిశుధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారు ఏ ప్రాంతాల నుండి వచ్చారో తెలుసుకున్నారు. గుండు గీయించుకునే భక్తుల నుండి ఎంత రుసుము వసూలు చేస్తున్నారో, రశీదులు జారీ చేస్తున్నారా, క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో వివరాలు ఆరా తీశారు. నిర్ణయించిన చార్జీలకన్నా అధికంగా వసూలు చేయరాదని, భక్తులకు పారదర్శకమైన సేవలు అందించాలన్నారు.

మహా శివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున, కళ్యాణ కట్ట వద్ద అదనపు సిబ్బంది నియామకం, తాగునీరు, కూర్చునే సౌకర్యం, భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత దేవస్థాన అధికారులు పాల్గొన్నారు.
Arattai