NANDYAL April14:- కళారాధన సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక సభ్యుడు, నంద్యాల శ్రీరామ డ్రస్ కంపెనీ నిర్వాహకుడు,మూడు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు పద్య పౌరాణిక నాటకానికి విశిష్ట సేవలు అందించిన మేకప్ కళాకారుడు రామబ్రహ్మం ఆచారి ఇటీవల అనారోగ్యానికి గురై మంగళవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది.
గోపవరం గ్రామానికి చెందిన రామబ్రహ్మం ఆచారి మరియు తండ్రి శ్రీనివాస చారి, బాబాయ్ రామయ్య చారి, సోదరుడు బాలబ్రహ్మం ఆచారి శ్రీరామ అడ్రస్ కంపెనీ ద్వారా అనేక దశాబ్దాలుగా పద్య నాటక రంగానికి విశేష మైనటువంటి సేవలు అందించారు.53 సంవత్సరాల వయసులోనే అకాల మృతి చెందిన రామబ్రహ్మం ఆచారి ఉత్తమ మేకప్ కు నంది పురస్కారం, కందుకూరి జిల్లా స్థాయి రంగస్థల పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం నుండి అందుకున్నారు.
వెంకటాచలం కాలనీలో ఉన్న రామబ్రహ్మం ఇంటి వద్ద కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ , కళారాధన సాంస్కృతిక సంస్థ సభ్యులతో కలిసి రామబ్రహ్మం పార్థివ శరీరానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ రామబ్రహ్మం ఆచారి నంద్యాల కళారాధన, కడప సవేరా ఆర్ట్స్,కర్నూలు లలిత కళా సమితి, రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక నాటక, సాంస్కృతిక సంస్థలు ప్రదర్శించిన వేలాది పౌరాణిక పద్య నాటకాలకు,చారిత్రక నాటకాలకు అవసరమైన తెరలు కట్టడం,మైకులు, లైటింగ్ ఏర్పాటు చేయడం, పాత్రలకు అవసరమైన దుస్తులు,ఆభరణాలు సమకూర్చి,రంగస్థలం అలంకరణ చేసి,పాత్రోచితంగా ఆహార్యం ( మేకప్) అందించిన రూపశిల్పిగా చేసిన కళా సేవలు కళాకారుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోతాయన్నారు.నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలలో రవీంద్ర భారతి హైదరాబాదులో ప్రదర్శించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర ,నిజామాబాద్ లో ప్రదర్శించిన రావణ ధాన్యమాలి, పార్వతీ పరిణయం వంటి నాటకాలకు పాత్రల రూపశిల్పిగా అద్భుతమైన మేకప్ అందించి ఆయా నాటకాలు విజయవంతంగా ప్రదర్శించడానికి దోహదం చేసిన కళాకారుడు రామబ్రహ్మం ఆచారి అని డాక్టర్ రవి కృష్ణ తెలిపారు. ఈ నాటకాలు కేవలం నంది నాటకోత్సవాలలోనే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చిన సమయంలో వీరు అందించిన కళా సేవలు మరువలేనివన్నారు.రామబ్రహ్మం మృతి కళా రంగానికి ముఖ్యంగా పౌరాణిక పద్య నాటకానికి తీరని లోటుగా మిగిలిపోతుందన్నారు.రామబ్రహ్మం ఆత్మకు శాంతి కలగాలని,వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆ నటరాజును కళారాధన ప్రార్థిస్తున్నదని తెలిపారు.బుధవారం నంద్యాలలో నిర్వహించిన అంత్య క్రియలలో అధిక సంఖ్యలో హాజరైన కళాకారులు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు.
Arattai