NANDYAL June 01 :- ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ను క్షేత్రస్థాయిలో అత్యంత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్వాహకులను ఆదేశించారు.

నంద్యాల మండలంలోని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒక రోజు ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని స్థానిక శ్రీ వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించారు.జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) జనార్దన్ రెడ్డి, నంద్యాల మండల విద్యాశాఖ అధికారి (MEO) బ్రహ్మం నాయక్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… పాఠశాలలకు వచ్చే నిరుపేద విద్యార్థులకు కడుపునిండా, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నిర్వాహకులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ఇటీవల విజయవాడలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన మధ్యాహ్న భోజన శిక్షణ, వంటల పోటీలలో మన జిల్లాలోని బండి ఆత్మకూరుకు చెందిన నిర్వాహకులు ప్రథమ బహుమతి (ఫస్ట్ ప్రైజ్) సాధించి నంద్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని నంద్యాల మండలంలోని నిర్వాహకులు కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి అని సూచించారు

బండి ఆత్మకూరు నిర్వాహకుల విజయం అందించిన స్ఫూర్తితోనే, ఈ శిక్షణ కార్యక్రమంతో పాటు నంద్యాల మండల పరిధిలోని నిర్వాహకులకు వంటల పోటీలను కూడా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. శుభ్రత, నాణ్యత, రుచితో పాటు ప్రభుత్వ నియమావళిని ఎలా పాటించాలనే అంశాలపై నిర్వాహకులకు అధికారులు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ సిబ్బంది, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు నంద్యాల మండల పరిధిలోని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai