విద్యాసంస్థల్లో రాజకీయ ప్రసంగాలు, జెండాలను అనుమతించం
విద్యార్థి, యువజన సంఘాల నాయకుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
AMARAVATHI : రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టంచేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ తో విద్యార్థి, యువజన సంఘాల జెఎసి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని విద్యార్థి, యువజన సంఘ నాయకులు మంత్రి లోకేష్ కు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విద్యార్థి సంఘ నాయకులకు ఆయా విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలపై చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశమిస్తామని అన్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లిస్తామని, ఈ విషయంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై వత్తిడితెస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు సుమారు రూ.4,200 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టిందని, ఆ సొమ్మును కూడా ఆర్థిక వెసలుబాటు చూసుకొని దశలవారీగా చెల్లిస్తామని తెలిపారు.

విద్యార్థి సంఘాలు కళాశాలల్లో నిర్వహించే యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కు సహకరిస్తామని అన్నారు. అపార్ ఐడితో అనుసంధానం ద్వారా విద్యార్థుల బస్ పాస్ ల జారీకి సులభతరమైన విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు. రాష్ట్రంలోని కళాశాలలు, యూనివర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టంచేశారు

ఈసారి కళాశాలల్లో అడ్మిషన్లు ఆలస్యం కాకుండా తగుచర్యలు చేపడతామని అన్నారు. వచ్చే ఏడాది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లకు సంబంధించిన షెడ్యూలును ఈ ఏడాదే ప్రకటిస్తామని, షెడ్యూలు ప్రకారమే సెట్ ల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వివిధ యూనివర్సిటీల్లో మిగిలిన పోయిన సీట్లకు నేరుగా అడ్మిషన్లకు అవకాశం కల్పించాలని విద్యార్థి సంఘ నేతలు కోరగా, బేసిక్ ఎగ్జామినేషన్ పాస్ కావాల్సిందేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 4,300 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, న్యాయపరమైన చిక్కులను అధిగమించి సాధ్యమైనంత త్వరగా వాటిని భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యార్థి యువజన సంఘాల జెఎసి మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చిన సమస్యల వివరాలిలావున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలి. విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘ నాయకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ విడుదల చేసిన ఉత్తర్వులను ఉపసంహరించాలి.
డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్లను రద్దుచేసి ఆఫ్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. పేదవిద్యార్థులకు పిజి విద్యను దూరంచేసే జిఓ నెం. 77ని రద్దుచేయాలి. కామన్ పిజి సెట్ విధానాన్ని రద్దుచేసి ప్రతి యూనివర్సిటీకి ప్రత్యేకంగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలి. పిపిపి విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటును నిర్మించే జిఓ నెం.107, 108లను రద్దుచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ పాఠశాల విద్యను కాపాడాలి. గత ప్రభుత్వం మూసివేసిన 2వేలకు పైగా పాఠశాలలను పునఃప్రారంభించాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టళ్లలో సంభవిస్తున్న ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, కమాటీ, వాచ్ మెన్ పోస్టులను భర్తీచేయాలి. యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి.

గత ప్రభుత్వం విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఎపి విద్యార్థి యువజన సంఘాల జెఎసి నాయకులు విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో విఎంఆర్ డిఎ చైర్మన్ ప్రణవ్ గోపాల్, శాప్ చైర్మన్ రవినాయుడు, కె.శివారెడ్డి, బి.నాజర్ జీ, జి.వాలరాజు (ఎఐఎస్ఎఫ్), కె.ప్రసన్న, పి.రామ్మోహన్ (ఎస్ఎఫ్ఐ), భాస్కర్, వినోద్ (పిడిఎస్ యు), వి.శ్రీనివాసరావు (ఎన్ఎస్ యుఐ), ఎల్.భానుసూరి (పిడిఎస్ఓ), జి.రామన్న, వై.రాము (డివైఎఫ్ఐ), పి.రాజేంద్రబాబు, యుగంధర్ (ఎఐవైఎఫ్) తదితరులు పాల్గొన్నారు
Arattai