తెలుగుభాష గొప్పతనాన్ని, సంస్కృతీ పరిమళాన్ని, సాహిత్య సంపదను నేటితరానికి అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైన మాతృభాషా పరిరక్షణ సమితి 20వ (వింశతి) వార్షికోత్సవం నంద్యాల పట్టణంలోని శ్రీశైల పబ్లిక్ స్కూల్ నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సమితి అధ్యక్షులు డా.దీవిహయగ్రీవాచార్యులు మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించడానికి, తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టడానికి, తెలుగు కళారూపాలను కాపాడటానికి తమ సంస్థ కృషి చేస్తున్నట్లు తెలిపారు.

జీవన వ్యవహారాలలో తెలుగు వినియోగాన్ని పెంపొందించడానికి అందరూ కృషి చేయాలన్నారు. ముఖ్యఅతిథులు చంద్రశేఖర కల్కూర, జె.ఎస్.ఆర్ .కె.శర్మలు మాట్లాడుతూ తెలుగుభాష, సంస్కృతి,సాహిత్య వికాసాలకు మనమంతా కృషిచేయాలని భవిష్యత్ వారసులైన పిల్లలు,యువతరం తెలుగుభాష పట్ల ఆత్మీయతను పెంచుకోవాలన్నారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ జ్ఞానానికి పునాది మాతృభాష అని, అమ్మభాషా వికాసానికి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు కృషిచేయాల్సిన అవసరముందన్నారు.

విశ్రాంత శాస్త్రవేత్త డా.రవీంద్రనాథ్ మాట్లాడుతూ జాతి అభివృద్ధి భాషా వికాసంతో ముడిపడి ఉంటుందని, 20 సంవత్సరాలుగా మాతృభాషా పరిరక్షణ సమితి అనేక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి గత రెండు దశాబ్ధాలుగా తమ సమితి ద్వారా పుస్తకావిష్కరణలు, అష్టావధానాలు, సాహితీ సదస్సులు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. నంది రైతు సమాఖ్య, మాతృభాషా పరిరక్షణ సమితి సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కర్నూలుకు చెందిన సాహితీవేత్త జె.ఎస్ .ఆర్ .కె. శర్మ రచించిన ‘రాయలసీమ కావ్య సముద్ర మథనం’ మరియు ‘పింగళి సూరన సాహితీ వైభవం’ పుస్తకాలను ముఖ్యఅతిథులు ఆవిష్కరించారు.

నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీమతి దండెబోయిన పార్వతి ‘పింగళి సూరన సాహితీ వైభవం’ పుస్తకాన్ని సమీక్షిస్తూ సాహితీ ప్రతిభామూర్తి, అష్టదిగ్గజకవులలో ఒకరైన పింగళి సూరన కవితా వైభవాన్ని, రచనా పటిమను పుస్తక రచయిత శర్మ గారు అద్భుతరీతిలో వర్ణించారన్నారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ నేత్రవైద్యులు ఎన్ .సి లక్ష్మయ్య గారికి అంకితమివ్వడం సంతోషదాయకమన్నారు.

మరో పుస్తకం ‘రాయలసీమ కావ్య సముద్ర మథనము’ను డా.కర్నాటి చంద్రమౌళిని సమీక్షించారు. రాయలసీమకు చెందిన 20 మంది ప్రసిద్ధ కవుల ఉత్తమ రచనలను క్రోడీకరించి రచయిత జె.ఎస్ .ఆర్ .కె. శర్మ రూపొందించిన ఈ సంకలనం తెలుగు పాఠకలోకాన్ని అలరిస్తుందన్నారు.

ఈ పుస్తకాన్ని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ పాండురంగారావుకు రచయిత అంకితమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ” తెలుగు భాషా వైభవం” సాహితీసదస్సులో డా.గెలివి సహదేవుడు, డా.కిశోర్ కుమార్ ,అవ్వారి శేషఫణి, శ్రీమతి వసుంధర, శ్రీమతి విజయదుర్గ,యం.శ్రీనివాసమూర్తి, డా.నీలం వెంకటేశ్వర్లు, గోళ్ళ సుదర్శనం, మురళీనాథరెడ్డి, మురళీకృష్ణారావు, ఓబుళపతి, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తక్షణమే భాషాభివృద్ధికి విధివిధానాలు రూపొందించుకొని తెలుగు వారు చైతన్యవంతం కావాల్సిన అవసరముందని సాహితీ సదస్సులో తీర్మానించారు. ‘తెనెలొలికే తెలుగు” అనే అంశంపై నిర్వహించిన కవిసమ్మేళనంలో గద్వాల రామకృష్ణ, నీలకంఠమాచారి,కొప్పుల ప్రసాద్ ,నరేంద్ర, మహమ్మద్ రఫిలు తెలుగుజాతి, భాష ఘనకీర్తి వైభవాన్ని తమ కవితల ద్వారా వినిపించి శ్రోతలను అలరించారు.

శ్రీశైల పబ్లిక్ స్కూల్ విద్యార్థినులు నిర్వహించిన మాతృభాష ఔన్నత్యాన్ని తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు. శ్రీశైల పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, మాతృభాషా పరిరక్షణ సమితి సభ్యులు, నంది రైతు సమాఖ్య నిర్వాహకులు అతిథులను,కవులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నందిరైతు సమాఖ్య అధ్యక్షులు బెక్కెం రామసుబ్బారెడ్డి, సమాఖ్య ప్రతినిధులు కొండా మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Arattai