AMARAVATHI Oct27:-బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ ప్రభావంపై రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కదలికలను ప్రతి గంట గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంథా తుఫాన్ గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తోంది. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,ఈరోజు మరియు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారని తెలిపారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్కు సూచించారు.

వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో మంత్రులు నారా లోకేష్, వంగ్లపూడి అనిత, ముఖ్య కార్యదర్శి (సీఎస్) మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం తగ్గించేందుకు అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సహా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
Arattai