NANDYAL Nov28:-బంగాళాఖాతంలో ఏర్పడిన “దిత్వా” వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, నంద్యాల జిల్లాలో శనివారం, ఆదివారం, సోమవారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు
ముఖ్యంగా మొక్కజొన్న మరియు వరి పంటల కోత పనులను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే కోత కోసిన పంటను తార్పాలిన్ షీట్లు వేసి రక్షించుకోవడం, వర్షాకాలంలో తేమకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.
పంట దిగుబడిని ఆరుబయట కాకుండా, తప్పనిసరిగా గోడౌన్లలో లేదా భద్రమైన గదుల్లో నిల్వ చేయాలని ఆయన తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు విద్యుత్ తీగలు, చెట్లు, నీటితో నిండిన రహదారులు వద్ద జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే సమీప గ్రామ వాలంటీర్లను, సంబంధిత తహసీల్దార్ లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని జెసి సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు సహాయం అందించేలా సిద్ధంగా ఉందని తెలిపారు.
Arattai