NANDYAL Dec 15:- ఇంధనాన్ని పొదుపు చేస్తూ భావితరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్, విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించాలనే ఉద్దేశంతో 2001వ సంవత్సరంలో ఇంధన పొదుపు చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, విద్యుత్ వంటి సహజ వనరులు మన నిత్య జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిని అవసరమైన మేరకు మాత్రమే వినియోగిస్తూ ప్రత్యామ్నాయ వనరులపై కూడా దృష్టి సారించాలని సూచించారు.
గృహోపకరణాల విషయంలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలు వినియోగిస్తే విద్యుత్ బిల్లులో గణనీయమైన ఆదా సాధ్యమవుతుందని తెలిపారు. సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడి లైట్లు ఉపయోగించడం ద్వారా సుమారు 50 శాతం వరకు విద్యుత్ ఆదా చేయవచ్చన్నారు. అవసరం లేని సమయంలో ఫ్యాన్లు, లైట్లు, టీవీలు ఆన్లో ఉంచకూడదని, ముఖ్యంగా ఎసీలను 24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉపయోగిస్తే సుమారు 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందని వివరించారు.

ఇళ్లకు లేత రంగులు వేయడం వల్ల తక్కువ విద్యుత్ వినియోగంతోనే ఇల్లు ప్రకాశవంతంగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే రిఫ్రిజిరేటర్లలోని రబ్బర్ సీల్ పాడైతే వెంటనే మార్చుకోవడం ద్వారా విద్యుత్ వృథా తగ్గుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా నీరు, గ్యాస్, ఇతర సహజ వనరులను వృథా చేయవద్దని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్బన్ డయాక్సైడ్, గ్రీన్హౌస్ వాయువుల పెరుగుదల వల్ల కాలుష్యం అధికమై ప్రపంచంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

రిఫ్రిజిరేటర్లను వేడి వనరుల దగ్గర గానీ, గోడకు చాలా దగ్గరగా గానీ ఉంచవద్దని, వేడి పదార్థాలను ఫ్రిజ్లో ఉంచకూడదన్నారు. అవసరం లేకుండా ఎసీలను ఆన్లో ఉంచడం నివారించాలని సూచించారు.
విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్ మాట్లాడుతూ, ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందజేస్తున్నట్లు చెప్పారు.
అనంతరం ఇంధన పొదుపు వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు నియంత్రణ ప్రతిజ్ఞను అధికారులతో కలెక్టర్ చేయించారు.
Arattai