NANDYAL April 08:- నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఎస్డీఆర్ స్కూల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వాల్యుయేషన్ కేంద్రంలో జరుగుతున్న పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

వివిధ జిల్లాల నుండి మొత్తం 1,86,489 మంది విద్యార్థుల సమాధాన పత్రాలు నంద్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నాయని డీఈఓ జనార్దన్ రెడ్డి కలెక్టర్కు నివేదించారు. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగనుందన్నారు. ఈ వాల్యుయేషన్ కార్యక్రమంలో 76 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 440 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 220 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొంటూ, మొత్తం 14 గదుల్లో సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతోందని డీఈఓ వివరించారు.

సమాధాన పత్రాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మాత్రమే కాకుండా స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద కూడా తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, కేంద్రాల్లో త్రాగునీరు, లైటింగ్ తదితర మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయా లేదా అన్న విషయాలను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ)ను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, కొట్టివేతలు లేకుండా అత్యంత జాగ్రత్తగా మార్కులు కేటాయించాలని ఎగ్జామినర్లకు కలెక్టర్ స్పష్టం చేశారు.
Arattai