అమరావతి అక్టోబర్ 17 : బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కంటికి రెప్పల్లా, సొంత బిడ్డల్లా చూసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. రోజూ కురుస్తున్న వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వారానికోసారి సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్యులతో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు ప్రతి రోజూ హాస్టళ్లను సందర్శించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్ల వార్డెన్లు, ఎంజేపీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో మంత్రి సవిత శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హాస్టళ్లలో పారిశుధ్యంపై తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులకు వేడి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే ఇవ్వాలన్నారు. వసతి గృహాల పరిసరాలను, మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. హాస్టళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా స్థానిక సంస్థల సాయంతో ఫాగింగ్ చేయించాలని మంత్రి సవిత ఆదేశించారు.

దురదృష్టకర ఘటనలకు తావివ్వొద్దు
ప్రస్తుతం రాష్ట్రంలో కొన్న సంక్షేమ హాస్టళ్లలో దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా, కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. వారానికోసారి హాస్టళ్లకు సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్య సిబ్బందితో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యాధికారితో వైద్యమందించాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రులకు తరలించాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులతో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. హాస్టళ్లలో విపత్కర పరిస్థితులు తలెత్తగానే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారమివ్వాలన్నారు. అన్నపర్రు బీసీ హాస్టల్ వంటి ఘటనలు పునరావృతం కానివ్వొద్దన్నారు.

రోజూ తనిఖీ ఫొటోలు పంపండి…
డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు, కో ఆర్డినేటర్లు రోజూ తమ పరిధిలో ఉన్న బీసీ హాస్టళ్లను, ఎంజేపీ స్కూళ్లను సందర్శించాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. సందర్శించిన కో ఆర్డినేట్ ఫొటోలతో తనిఖీ నివేదికలను వాట్సాప్ గ్రూప్ లో పొందుపర్చాలన్నారు. హాస్టళ్ల నిర్వహణలో వార్డెన్లు, డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు, కో ఆర్డినేటర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యసాధనలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

వంద శాతం ఫలితాలే లక్ష్యం
రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వంద శాతం ఫలితాలు రావాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులతో ప్రేమ పూర్వకంగా మెలుగుతూ, విద్యపై ఆసక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల మధ్య స్నేహాపూర్వక వాతావరణం పెంపొందించేలా చూడాలన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఎంజేపీ కార్యదర్శి మాధవీలత, వివిధ జిల్లాలకు డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు, హాస్టల్ వార్డెన్లు కో ఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
Leave a Reply