NANDYAL:- జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా విభాగాలకు కేటాయించిన వార్షిక లక్ష్యాలను వంద శాతం అధిగమించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయ వనరుల పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్ సహా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో వనరుల వినియోగం, పర్యవేక్షణ, లక్ష్య సాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కేటాయించిన లక్ష్యాన్ని అధిగమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చేపట్టిన అంశాలపై తరచూ సమీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.

ఎక్సైజ్ శాఖలో గత ఏప్రిల్ నుండి నవంబర్ మాసం వరకు నిర్ణయించిన 596.63 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి 640.86 కోట్లు సాధించడమే కాకుండా 7.14 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం జరిగిందన్నారు. మిగిలిన నెలల్లో కూడా ఈ వేగాన్ని కొనసాగించి ఆదాయం మరింత పెంచాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్కు సూచించారు.
మైనింగ్ శాఖ పనితీరును పరిశీలించిన కలెక్టర్, వార్షిక లక్ష్యం 530 కోట్లు కాగా నవంబర్ వరకు కేవలం 143 కోట్లు మాత్రమే సాధించారని శాఖలో ఉన్న లోపాలను తక్షణం సరిచేయడంతో పాటు చెక్పోస్టులను బలోపేతం చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం నుండి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని ఆదాయాన్ని పెంచి లక్ష్యాన్ని చేరుకునేందుకు మైనింగ్ శాఖ అధికారులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. కార్యకలాపాలు నిలిచిపోయిన 102 మైనింగ్ యూనిట్లను పునఃప్రారంభిస్తే ఆదాయ వనరులు సమకూరుతాయన్నారు.
అలాగే వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్, రవాణా తదితర శాఖలకు కేటాయించిన వార్షిక లక్ష్యాలను గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటూ ఆదాయాలను వృద్ధి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదాయం సృష్టించే వనరులపై అధికారులు నిరంతర పర్యవేక్షణ సాగించాలని, లక్ష్యాల సాధనలో ఎట్టి రాజీ లేకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Arattai