NANDYAL JAN 19:-యోగి వేమన రచించిన పద్యాలు సమాజానికి నైతిక బోధనను అందించాయని, చిన్నతనం నుంచే వాటిని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో యోగి వేమన జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగి వేమన పద్యాలు సామాజిక సమానత్వం, మానవతా విలువలు, నిజాయితీ, కష్టపడి జీవించడం వంటి అంశాలను బలంగా ప్రతిపాదిస్తాయని తెలిపారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వేమన పద్యాలు ఇప్పటికీ ప్రాధాన్యతను కోల్పోకుండా సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పరంగా అధికారికంగా ఏడాది పొడవునా నిర్వహించాల్సిన జయంతి, వర్ధంతి వేడుకల జాబితాను ముందుగానే సిద్ధం చేసి జిల్లా అధికారులకు పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత నెలలో జరిగే జయంతి, వర్ధంతి కార్యక్రమాలపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా సమయపాలనతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Arattai