NANDYAL Feb 27 :- ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం (CAPEX విధానం) కింద ఎస్సీ, ఎస్టీ వినియోగదారులందరికీ ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఎన్జీవో కాలనీ, పొన్నాపురం ఎస్సీ కాలనీలో ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న 2 కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ యూనిట్ల స్థాపన ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న లబ్ధిదారురాలు సమాదానమ్మ గారి నివాస గృహంపై యాక్సెస్ సోలార్ వెండర్ ద్వారా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్లాంట్ పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం తదితర అంశాలపై ఆరా తీశారు.
ఈ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ యాక్సెస్ సోలార్ వెండర్ (నంద్యాల), రోటోమాగ్ ఎనర్టెక్ లిమిటెడ్ (డోన్, ఆత్మకూరు) సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సంబంధిత వెండర్ ప్రతినిధులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు బలహీన వర్గాల ప్రజలకు విద్యుత్ వ్యయభారం గణనీయంగా తగ్గడంతో పాటు, పునరుత్పాదక ఇంధన వినియోగం పెరిగి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ సుధాకర్, ఈఈ (ఆపరేషన్) నంద్యాల, ఈఈ ఎంఆర్టిం నంద్యాల, డీఈఈ డిస్ట్రిబ్యూషన్ నంద్యాల, డీఈఈ టీఆర్ఈ నంద్యాల, డీఈఈ కన్స్ట్రక్షన్ నంద్యాల, ఏఈ డి2 నంద్యాల మరియు ఓ అండ్ ఎం సిబ్బంది పాల్గొన్నారు.
Arattai