NANDYAL April05:- ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్యచే 2026 పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని విశ్రాంత అంతర్జాతీయ శాస్త్రవేత్త డా.రవీంద్రనాద్ అందుకున్నారు. ఆదివారం ప్రథమనంది సమీపంలోని గాయత్రీ దేవాలయ ఆవరణలో పురస్కార ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు డా.రవీంద్రనాథ్ ,జ్ఞానప్రసూనాంబ దంపతులకు ఉగాది పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. మాతృభాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు డా.దీవి హయగ్రీవాచార్యులు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణసేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి మనోహరరావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి,శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ చిట్టిబొట్ల భరద్వాజశర్మ, విశ్రాంత న్యాయాధికారి కాశీభట్ల శివప్రసాద్ , ప్రముఖ వైద్యులు డా.కాదర్ బాద్ ఉదయశంకర్ తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

డా.దీవి హయగ్రీవాచార్యులు మాట్లాడుతూ డా.రవీంద్రనాథ్ ప్రత్తి పరిశోధనలో కీర్తి ప్రతిష్టలను పొంది తెలుగు వారి ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చారన్నారు. పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రవీంద్రనాథ్ గారు ప్రత్తి పరిశోధనలో రారాజుగా పేరు గాంచారని, అమెరికా,బంగ్లాదేశ్ తదితర దేశాలలో పలుమార్లు పర్యటించి పత్తిలో అధిక దిగుబడికి అనేక సూచనలు అందించారని గుర్తు చేశారు. ప్రత్తి పరిశోధనలో వారి కృషికి అనేక జాతీయ,అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవటం నంద్యాలకు గర్వకారణమన్నారు. బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ 90 సంవత్సరాల వయసులో కూడా తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వహణ, రైతు సదస్సుల నిర్వహణలో రవీంద్రనాథ్ గారు తన సేవలు కొనసాగించటం అభినందనీయమన్నారు.
వీరు సృష్టించిన నరసింహ పత్తి విత్తనం ఆధారంగా వచ్చిన హైబ్రీడ్ వంగడాలు దేశంలో ఏటా కోటి ఎకరాలలో రైతులు సాగు చేయడం అద్భుతం, ఆశ్చర్యకరమన్నారు. వీరి కృషికి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమ సమాఖ్య కోరుతుందన్నారు. వారి విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది ఉగాది పురస్కారం తమ సంస్థ తరపున అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి మనోహర్ రావు మాట్లాడుతూ బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు.

ప్రముఖ వైద్యులు డా.ఉదయ్ శంకర్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో కాదర్ బాద్ కుటుంబం ముందుంటుందన్నారు. కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, కార్యదర్శి యం.వి కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఓబులపతి,రఫీ,మధుసూదనరెడ్డి, మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, డా.నీలం వెంకటేశ్వర్లు,శేషఫణి,డా.రమణమూర్తి,బ్రాహ్మణ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు కేశవమూర్తి,కార్యదర్శి సుధీంద్రాచార్యులు,మాజీ అధ్యక్షులు కరణం మురళీకృష్ణారావు మరియు పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ కుటుంబసభ్యులు, రైతులు,సాహితీ వేత్తలు, బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
Arattai