NANDYAL May26 :- నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ మరియు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో ఖండించారు .జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి గొడ్డలి పార్టీయేనని అన్నారు

ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ఎండగట్టారు. “మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేశావ్ జగన్?” అని ఆయన ప్రశ్నించారు. వైకాపా పాలనలో ఎన్ని గ్రామాల్లో రాజకీయ హత్యలు జరిగాయో తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, వాటిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. వైకాపా అరాచకాలను భరించలేకనే ప్రజలు గత ఎన్నికల్లో 151 స్థానాల నుండి 11 స్థానాలకు పరిమితం చేసి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి రాగానే ‘ప్రజా వేదిక’ను కూలుస్తానని బహిరంగంగా ప్రకటించడంలోనే జగన్ లోని క్రూరత్వం బయటపడిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగాన్ని తగ్గించడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే, జగన్ మాత్రం పరిశ్రమలను మరియు పెట్టుబడిదారులను బెదిరిస్తూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు.

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ జగన్ తీరు ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో వైకాపాకు సింగిల్ డిజిట్ స్థానాలు కూడా రావని జోస్యం చెప్పారు. అలాగే, తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,875 క్లస్టర్లలో ‘మహానాడు’ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మరియు పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.ఈ సమావేశంలో నందికొట్కూరు టిడిపి ఇంచార్జి గౌరు వెంకటరెడ్డి, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , మంచాలకట్ట శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai