NANDYAL July10 :- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ప్రతి దశను నాణ్యతతో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎన్నికల నమోదు అధికారులు (EROs), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs), తక్కువ పురోగతి సాధించిన బూత్ స్థాయి అధికారులు (BLOలు) పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అదే సమయంలో ఓటు హక్కు దుర్వినియోగానికి అవకాశం లేకుండా, ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితాలో నమోదైన మరణించిన ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు నివాసం మార్చుకున్న వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైన (డబుల్ ఎంట్రీలు) ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. బూత్ లెవల్ ఏజెంట్ (BLA) ధృవీకరణతో పాటు అవసరమైన క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి, అర్హత లేని నమోదులను ఈ నెల 12వ తేదీలోపు తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన సేకరించాలని, సేకరించిన ఫారాలను ఆలస్యం చేయకుండా వెంటనే డిజిటలైజేషన్ చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. ఎక్కడా పెండింగ్ లేకుండా ప్రతిరోజూ లక్ష్యాలను పూర్తి చేస్తూ పురోగతిని నమోదు చేయాలని, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతం కావాలంటే క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా ధృవీకరించి, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Arattai