NANDYAL July17:- ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని సానుకూల దృక్పథంతో పరిశీలించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ లు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు, సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించదగినవైతే, మరికొన్ని చట్టపరమైన లేదా ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్జీదారులతో స్వయంగా మాట్లాడిన అనంతరమే నివేదికలు సమర్పించాలని సూచించారు.

కేవలం పైపైన పరిశీలించి సమస్య పరిష్కారమైందని నమోదు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి ప్రధానంగా భూ సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం, నిలిచిపోయిన భవనాల పనులు పూర్తి చేయడం, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం వంటి అభివృద్ధి పనులకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను గ్రామ స్థాయిలోనే గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వెలుగోడు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని, మిగిలిన మండలాల్లో కూడా వచ్చే వారం నుంచి ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం వెలుగోడు మండల పరిధిలోని 20 అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం తయారు చేయడానికి అవసరమైన ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలు (యుటెన్సిల్స్)ను జిల్లా కలెక్టర్, శ్రీశైలం ఎమ్మెల్యే సంయుక్తంగా పంపిణీ చేశారు.

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పోషకాహారాన్ని పరిశుభ్రంగా, సురక్షితంగా తయారు చేసేలా అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సిబ్బందికి సూచించారు.
Arattai