NANDYAL June20 :- ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, “ఆంధ్ర కేసరి”గా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నంద్యాల పట్టణంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని నంది రైతు సమాఖ్య నాయకులు పేర్కొన్నారు. ఆ అనుబంధానికి గుర్తుగా గతంలో నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ఆ మార్కెట్కు “ప్రకాశం పంతులు కూరగాయల మార్కెట్”గా నామకరణం చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు.
అయితే కాలక్రమేణా విగ్రహం దెబ్బతినడంతో దానిని తొలగించారని, అనంతరం పునఃప్రతిష్ఠకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఆ మహనీయుని సేవలను భావితరాలకు చాటిచెప్పే విధంగా అదే ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని కోరుతూ శనివారం నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు నంది రైతు సమాఖ్య నాయకులు విజ్ఞాపన పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు బి.వి. రామసుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కన్వీనర్ ఓబుళపతి తదితరులు మాట్లాడుతూ, స్వాతంత్ర్య ఉద్యమంలో అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించి, ప్రజాస్వామ్య విలువలకు అంకితభావంతో సేవలందించిన ప్రకాశం పంతులు వంటి మహనీయుల జ్ఞాపకాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
విజ్ఞాపనకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ, భవిష్యత్తులో చేపట్టనున్న కూరగాయల మార్కెట్ అభివృద్ధి సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి, సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించడం పట్ల నంది రైతు సమాఖ్య నాయకులు హర్షం వ్యక్తం చేశారు..
Arattai