వెండర్ ఎంపిక పూర్తైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించాలి
ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో నంద్యాల జిల్లాలో అంచనా మేరకు పురోగతి సాధించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో డిఈలు, ఈఈలతో పీఎం సూర్యఘర్ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీ సుధాకర్, ఎల్డిఎం శ్రీ రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
రాబోయే కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్ష చేసే అవకాశముందని పేర్కొన్నారు. ప్రతి మండలంలో లక్ష్యానికి అనుగుణంగా పురోగతి సాధించాలన్నారు. వెండర్ ఎంపిక (కమిషన్) పూర్తయిన దరఖాస్తులను ఆగకుండా వెంటనే పూర్తి చేసి, లబ్ధిదారులు ప్రయోజనం పొందేలా చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

తక్కువ శాతం పురోగతి కనబరుస్తున్న నంద్యాల, రుద్రవరం, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల, ఔకు, సంజామల, బనగానపల్లె (రూరల్), ఆత్మకూరు (రూరల్), శ్రీశైలం, ప్యాపిలి మండలాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మండలాల్లో శనివారం నాటికి గణనీయమైన పురోగతి సాధించేలా తహసీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆమె ఆదేశించారు.
అభ్యర్థులకు అవసరమైన రుణ సహాయం బ్యాంకుల ద్వారా సులభంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని, బ్యాంకింగ్ వ్యవస్థ పథకం అమలులో పూర్తిగా సహకరించాలని కలెక్టర్ సూచించారు. లక్ష్యాలను అధిగమించేలా విద్యుత్ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు.
Arattai