NANDYAL Dec 15:-విద్యార్థుల్లో ఆత్మహత్యల ప్రభావాన్ని తగ్గించి, మానసిక ఒత్తిడిని జయించేలా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో, ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలు మరియు ఆత్మహత్యల నివారణకు సంబంధించి సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ (డిఎల్ఎంసీ) ఏర్పాటు అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి, ఆత్మహత్యలను నివారించేందుకు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ ద్వారా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి స్థాయిని అంచనా వేయడంతో పాటు, అవసరమైన సమయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులు అందించాల్సిన మద్దతు ఎంతో కీలకమని అన్నారు. ప్రతి కళాశాలలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. అదే విధంగా క్యాంపస్లలో ర్యాగింగ్ వంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదనపు ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ, విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తి పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. చదువుతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు మరియు సహపాఠ్య కార్యకలాపాల వైపు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై అధిక ఒత్తిడి పెట్టకుండా, వారికి నచ్చిన రంగాల్లో ప్రతిభ కనబర్చేందుకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. కళాశాలల్లో విద్యార్థులను పోల్చడం లేదా గ్రేడింగ్ చేయడం కాకుండా, అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు
ఈ సమావేశంలో పీఎస్సీ & కెవిఎస్సీ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్. శశికళ, అదనపు ప్రభుత్వ న్యాయవాది ఏ. వెంకటేశ్వర్లు, డీవిఈఓ శంకర్ నాయక్, బాలల సంరక్షణ అధికారి డి. స్వప్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
Arattai