NANDYAL JAN12 :- పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూముల విభజనకు సంబంధించి ప్రజలకు మరింత సులభమైన, పారదర్శకమైన విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆధారంగా, విల్ లేకుండా (Intestate Deaths) వారసత్వంగా లభించిన పూర్వీకుల వ్యవసాయ భూముల విభజన పత్రాలపై (Partition Deeds) స్థిరమైన (Fixed) స్టాంప్ డ్యూటీని నిర్ణయించినట్లు కలెక్టర్ వివరించారు.
ఈ నూతన నిబంధనల ప్రకారం, విభజనకు లోబడి ఉన్న భూమి మొత్తం మార్కెట్ విలువ రూ.10 లక్షల వరకు ఉంటే కేవలం రూ.100/- స్టాంప్ డ్యూటీ మాత్రమే వసూలు చేయబడుతుందన్నారు. భూమి మొత్తం మార్కెట్ విలువ రూ.10 లక్షలకు మించి ఉంటే రూ.1,000/- స్థిర స్టాంప్ డ్యూటీగా నిర్ణయించబడిందన్నారు. ఇప్పటి వరకు కుటుంబ వారసత్వ భూముల విభజనలో నమోదు లేకుండానే మ్యూటేషన్లు జరగడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడమే కాకుండా, భవిష్యత్లో వివాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
ఈ సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా, విభజన పత్రాలపై స్టాంప్ డ్యూటీ వసూలుకు సంబంధించి గతంలో జారీ చేసిన సర్క్యులర్ సూచనలను ప్రభుత్వం రద్దు చేసిందని, ఇకపై ఒకే విధమైన ఏకరీతి విధానం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నూతన నిర్ణయంతో ప్రజలు తప్పనిసరిగా విభజన పత్రాలను రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ప్రోత్సాహం లభిస్తుందని, చట్టబద్ధమైన హక్కులు భద్రపడటంతో పాటు భవిష్యత్ తగాదాలకు చెక్ పడుతుందని కలెక్టర్ తెలిపారు.
Arattai