NANDYAL Dec 12:- జిల్లాలో రైతులు, స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగే లబ్ధిదారులకు బ్యాంకులు మరింత ప్రోత్సాహకరంగా రుణాలు మంజూరు చేసి ఆర్థిక బలోపేతానికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (DLRC) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆర్బీఐ ఎల్డిఒ నవీన్, నాబార్డ్ డిడిఎం కార్తీక్, డిసిసిబీ సీఈఓ రామాంజనేయులు, ఎల్డిఎం రవీంద్రకుమార్, లైన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.15,120.09 కోట్ల రుణ లక్ష్యాలు నిర్దేశించబడగా, ఇప్పటి వరకు రూ.10,518.67 కోట్లు మాత్రమే సాధించారని మిగిలిన లక్ష్యాలను నిర్ణీత గడువులోనే పూర్తి చేసేందుకు బ్యాంకులు ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ – ఆర్థిక పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సూచించారు.

ముఖ్యంగా పిఎం సూర్యఘర్ పథకంలో జిల్లాలో ఇప్పటి వరకు 2,200 సౌర ఫలకాలు మాత్రమే ఏర్పాటు చేసిన విషయాన్ని కలెక్టర్ గుర్తుచేశారు. గ్రామాలవారీగా లక్ష్యాలు నిర్ధేశించి, బ్యాంకులు రుణాలు అందిస్తే జిల్లాలో 100 శాతం ఇళ్లకు సోలార్ ఫలకాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, తద్వారా గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల వరకు ప్రోత్సాహకం అందించే అవకాశం ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పటికీ, ప్రధానమంత్రి ఉపాధి కల్పన, MSME, సిసిఆర్సి రుణాల మంజూరు విషయంలో పురోగతి తక్కువగా ఉందని కలెక్టర్ వివరించారు. విద్యా, హౌసింగ్ రుణాలపై కూడా బ్యాంకర్లు దృష్టి పెట్టాలని సూచించారు.

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, పెచ్చెరువు, బైర్లూటి, నాగలూటి, హటకేశ్వరం ప్రాంతాల చెంచు ప్రజలకు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రుణ సహాయం అందించాలని బ్యాంకర్లను సూచించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆటో డ్రైవర్స్ సేవ వంటి పథకాల్లో 1,74,257 మంది లబ్ధిదారులకు ఈ–కెవైసీ పూర్తి కాకపోవడం వల్ల నగదు జమ కాలేదని, ఇప్పటి వరకు 36,317 మంది మాత్రమే పూర్తిచేసామని, ఇంకా 1,37,940 మంది లబ్ధిదారుల ఈ–కెవైసీలు పూర్తి చేయాల్సి ఉందన్నారు.
వీటి పూర్తి చేయడంలో బ్యాంకులు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో నిర్మిస్తున్న బహుళ ప్రయోజన గోదాములకు రహదారులు, డ్రైయింగ్ ప్లాట్ఫార్ములు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, దీనిపై బ్యాంకర్లు పెట్టుబడులు, రుణ సదుపాయాల రూపంలో దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
వ్యవసాయం, పశు సంవర్థక–మత్స్య రంగాల పెట్టుబడి ప్రణాళిక
రీఫ్ 2026, రబీ 2026–27 పంటల ఎకరాకు ఆర్థిక ప్రమాణాలు, అలాగే పశుసంవర్థక మరియు మత్స్య రంగాలకు సంబంధించిన తలసరి పెట్టుబడి 2026–27 ప్రణాళికలు సమావేశంలో ఖరారు చేశారునాబార్డ్ డిడిఎం కార్తీక్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన పోస్టర్లను బ్యాంకుల్లో ఏర్పాటు చేయడం ద్వారా అవగాహన పెరిగి, ఎక్కువమంది లబ్ధిదారులు ప్రయోజనం పొందగలరని తెలిపారు. అలాగే ఎఫ్పిఓలకు రుణ సదుపాయాలు అందిస్తే పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. అనంతరం నాబార్డు టర్మ్ రుణాలకు సంబంధించిన పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
Arattai