NANDYAL July27:- అమృత్ 2.0 పథకం ద్వారా నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ తెలిపారు. సోమవారం నంద్యాల పట్టణంలోని మహానంది రోడ్డులోని హెడ్ వాటర్ వర్క్స్ ఆవరణలో అమృత్ 2.0 పథకం కింద రూ.38.75 కోట్ల వ్యయంతో 16 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మించనున్న సమగ్ర తాగునీటి శుద్ధి కర్మాగారం (WTP) నిర్మాణ పనులకు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంతో అమృత్ 2.0 పథకం ద్వారా నంద్యాల పట్టణానికి అత్యంత కీలకమైన తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. వెలుగోడు రిజర్వాయర్లో ప్రస్తుతం 1.7 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో భూగర్భ జలాలు కొంత మేర రీచార్జ్ అవుతున్నాయని తెలిపారు. అయితే ఎల్నినో ప్రభావం కారణంగా జిల్లాలో నీటి కొరత పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున రైతులు వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.

జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ “మన్ కీ బాత్” కార్యక్రమంలో నంద్యాల జిల్లాను ప్రశంసించడం జిల్లాకు గర్వకారణమన్నారు. అదే సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి కృషిని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించడం జిల్లా యంత్రాంగం సమిష్టి పనితీరుకు లభించిన జాతీయ స్థాయి గుర్తింపుగా అభివర్ణించారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “సూపర్ సిక్స్” పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, మంత్రి చేతుల మీదుగా నంద్యాల నియోజకవర్గంలో మొత్తం రూ.211 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్రధాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఇందులో రూ.3.50 కోట్లతో చిన్న చెరువు పునరుజ్జీవన ప్రాజెక్టు, రూ.169.67 కోట్లతో 32 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి కర్మాగారం (STP), రూ.38.75 కోట్లతో 16 ఎంఎల్డీ సామర్థ్యంతో మంచి నీటి శుద్ధి కర్మాగారం (WTP) నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన అనంతరం నంద్యాల పట్టణ ప్రజలకు భవిష్యత్తులో తాగునీటి సమస్య లేకుండా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
అలాగే మురుగు నీటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి పర్యావరణానికి అనుకూలంగా విడుదల చేయడం ద్వారా డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. చిన్న చెరువు పునరుజ్జీవనంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరిగి నీటి వనరులు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో ఈ మూడు ప్రాజెక్టులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, అలాగే ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్కు జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Arattai