ప్రజల్లో హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్పై సరైన అవగాహన పెంపొందితేనే జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చడం సాధ్యమని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్.ఐ.వి/ఎయిడ్స్ చట్టం–2017 మరియు తల్లి–బిడ్డ రక్షణపై అవగాహన కల్పించే గోడ పత్రికను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తదితరులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్పై సరైన అవగాహన పెంపొందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పెద్ద ఎత్తున కృషి చేయాలన్నారు. ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగేలా విస్తృత ప్రచారం చేయాలని సంబంధిత శాఖాధికారులకు ఆమె సూచించారు.
గోడ పత్రికలను జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేయాలని తెలిపారు. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బాధితులపై వివక్ష లేకుండా సమాజంలో సానుకూల దృక్పథం పెంపొందించడం, అలాగే తల్లిలో నుండి శిశువుకు హెచ్.ఐ.వి సంక్రమణను నివారించేందుకు ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించడం ఈ ప్రచార పత్రిక ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు.
Arattai