NANDYAL May04 :- అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పురస్కరించుకుని 100 రోజుల ఉచిత ఆన్లైన్ యోగా తరగతులకు విస్తృత ప్రచారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సంయుక్తంగా నిర్వహిస్తున్న 100 రోజుల ఉచిత ఆన్లైన్ యోగా తరగతుల గురించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు మరియు సాధారణ ప్రజలకు ఈ తరగతుల లింక్ను విస్తృతంగా షేర్ చేసి, ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే మొదటి 14 రోజుల లైవ్ యోగా సెషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6, 7, 8 గంటలకు మరియు సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య మూడు సెషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో సెషన్ 45 నిమిషాల పాటు కొనసాగుతుందని, ఈ కార్యక్రమాన్ని ‘హాబిల్డ్ హెల్త్ టెక్’ సంస్థతో కలిసి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.అలాగే, మండల మరియు జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం (PGRS) కార్యక్రమాల్లో ఆయుష్ విభాగం ద్వారా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ వంటి సంప్రదాయ వైద్య విధానాల ద్వారా ప్రజలకు చికిత్స అందించడంతో పాటు అవగాహన పెంచాలని సూచించారు. నంద్యాల పట్టణంలో ఈ వైద్య సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కెమికల్ మందుల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించేందుకు సంప్రదాయ వైద్య విధానాలపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికంగా కనిపిస్తున్న మెడ, నడుము, మోకాళ్ల నొప్పుల నివారణలో ఆయుర్వేద తైలాలు ప్రయోజనకరమని వివరించారు. కర్పూర తైలం, మహానారాయణ తైలం, పిండ తైలం, సహచరాది తైలం వంటి ఔషధ తైలాల వినియోగంతో నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. వీటి వినియోగంతో పాటు యోగా సాధన చేయడం ద్వారా దీర్ఘకాలికంగా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. ఈ తైలాలు ప్రభుత్వ సరఫరా ద్వారా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.పీజీఆర్ఎస్ వేదికల్లో ఆయుష్ మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆయుష్ మెడికల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Arattai