ALLAGADDA June05 :- ప్రజల నుండి స్వీకరించే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, జాప్యానికి తావులేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. “వన్ మంత్ – ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ 11 కల్వర్టులు, ఒక కాంపౌండ్ వాల్, ఒక గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు మొత్తం రూ.2.34 కోట్ల వ్యయంతో పరిపాలనా మంజూరులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆర్.ఓ. ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.71 లక్షల వ్యయంతో పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అదేవిధంగా విద్యుత్ శాఖ, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ), హౌసింగ్, రెవెన్యూ తదితర శాఖల పరిధిలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మొత్తం 160 మంది లబ్ధిదారులకు సాంక్షన్ ఆర్డర్లు, ఎండార్స్మెంట్లు అందజేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పూర్తి చేసిన పనులకు ఎండార్స్మెంట్లు, కొత్తగా మంజూరైన పనులకు మంజూరు ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

1508 వినతుల్లో 857 సమస్యలకు పరిష్కారం
గత మూడు వారాల్లో మొత్తం 1508 వినతులు అందగా, వాటిలో 857 సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన 651 వినతులు చట్టపరమైన అంశాలు, నిధుల కేటాయింపుల కారణంగా పరిశీలనలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యలకు కేవలం తాత్కాలిక పరిష్కారం కాకుండా తార్కిక ముగింపు ఇవ్వాలని సూచించారు

పెండింగ్ సమస్యలపై మళ్లీ ప్రత్యేక సమావేశం
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ సమీక్షించేందుకు 15 రోజుల నుంచి నెల రోజుల్లోగా మరోసారి సమావేశం నిర్వహించి, అర్జీదారుల సమక్షంలోనే ఎండార్స్మెంట్లు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు.

శ్మశాన వాటికల రహదారులు, కల్వర్టులకు నిధుల మంజూరు
రైతులు పొలాలకు వెళ్లేందుకు అవసరమైన కల్వర్టుల నిర్మాణ ప్రతిపాదనలను పరిశీలించినట్లు తెలిపారు. శ్మశాన వాటికలకు వెళ్లేందుకు దారి లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి తీసుకురావడంతో స్పందించిన కలెక్టర్, అలాంటి సమస్యల పరిష్కారం కోసం 14 పనులకు తక్షణమే నిధులు మంజూరు చేశారు. పనులను వెంటనే ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు అంచనాలు
గత మూడు వారాల్లో అందిన వినతుల మేరకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రెయిన్లకు సంబంధించిన అంచనాల విలువ రూ.7 కోట్లుగా ఉందన్నారు. ఈ వారం వచ్చిన ప్రతిపాదనలను కలుపుకుని సుమారు రూ.10 కోట్ల పనులకు ‘పల్లె పండుగ-3.0’లో భాగంగా అంచనాలు సిద్ధం చేసి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.3.05 కోట్ల విలువైన పనులకు శాంక్షన్ జారీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. డబ్ల్యూ.కొత్తపల్లి పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్స్ అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

రెవెన్యూ, భూ రికార్డుల సమస్యలకు పరిష్కారం
రెవెన్యూ, సర్వే, భూ రికార్డులకు సంబంధించిన దాదాపు 50 సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. అర్హులైన రైతులకు వారి భూములను అప్పగించడం ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు. దీంతో రైతుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారి భూ సంబంధిత సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించగలిగామని కలెక్టర్ వెల్లడించారు.

ఇనామ్-2 పట్టా సమస్యలకు చెక్.. రైతుల్లో హర్షం
దీవెనపెంట గ్రామానికి చెందిన రైతులు ఎదుర్కొంటున్న ‘ఇనామ్-2 పట్టా’ సమస్యను అధికారులు పరిష్కరించి వన్-బి, అడంగల్ రికార్డులను ఆన్లైన్లో నమోదు చేశారు. తొమ్మిది మంది రైతులకు సంబంధించిన భూ రికార్డుల సమస్యలు పరిష్కారం కావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.

పీజీఆర్ఎస్ ద్వారా 14 రోజుల్లో పరిష్కారం
నేలపాడు గ్రామానికి చెందిన చిట్టేపూర్ రాము మునిరెడ్డి మ్యుటేషన్ దరఖాస్తును కేవలం 15 రోజుల్లో పూర్తి చేసి ఆమోదం తెలిపారు. గత 6-7 సంవత్సరాలుగా పరిష్కారం కాని భూ సమస్యలు పీజీఆర్ఎస్ ద్వారా కేవలం 14 రోజుల్లోనే పరిష్కారమై వన్-బి, అడంగల్ పత్రాలు పొందగలిగామని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

లబ్ధిదారుల కృతజ్ఞతలు
జమ్ములదిన్నె గ్రామానికి చెందిన గురుం విజయరాజు, మద్దూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తదితరులు తమ గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు నాలుగు వారాల వ్యవధిలోనే పరిష్కారం లభించిందని పేర్కొంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారికి కృతజ్ఞతలు తెలిపారు.
Arattai