NANDYAL May23 :-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ “ఆపరేషన్ క్లీన్ స్వీప్” శనివారం నంద్యాల పురపాలక సంఘం పరిధిలో ఘనంగా ప్రారంభమైంది. నంద్యాల పట్టణంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన గాంధీ చౌక్ లో గల కూరగాయల మార్కెట్ పరిసరాలలో ఈ పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మంత్రివర్యులు స్వయంగా చేతిలోకి చీపురు పట్టి, మార్కెట్ పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలలో (ULB) నేటి (మే 23) నుండి జూన్ 20, 2026 వరకు నెల రోజుల పాటు ఈ “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పట్టణాల్లోని అంతర్గత రహదారులు, మురుగు కాలువలు (డ్రైన్లు) మరియు ప్రజలు ఎక్కువగా తిరిగే మార్కెట్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ వినూత్న కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

“శుభ్రమైన రోడ్లు – శుభ్రమైన డ్రైన్లు – స్వచ్ఛమైన పరిసరాలు” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని, నంద్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు పురపాలక అధికారులు, సిబ్బంది, వ్యాపారస్తులు మరియు స్థానిక ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించి భాగస్వాములు కావాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు.

ఈ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈ గుర్రప్ప, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు స్థానిక కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai